పెళ్లి చూపులు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ.. తాజాగా అర్జున్ రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా పోస్టర్లు నగరంలో ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. హీరోహీరోయిన్ల లిప్కిస్ పోస్టర్ను ఆర్టీసీ బస్సులపై కూడా అతికించారు. ఆర్టీసీ బస్సులపై ఆ పోస్టర్లు చూసిన మాజీ ఎంపీ వీ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను చెడగొట్టేలా ఉన్న ఇలాంటి అసభ్యకర పోస్టర్లను బస్సులపై వేసుకునేంత దీనస్థితికి ఆర్టీసీ దిగజారిందా? అంటూ వీహెచ్ ప్రశ్నించారు. తనకు కనిపించిన పోస్టర్లను చించేశారు.
ఆర్టీసీ బస్సుపై ఉన్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ పోస్టర్ను మాజీ ఎంపీ వీహెచ్ చించుతున్న ఫొటో ఒకటి పలు వెబ్సైట్లతో పాటు సోషల్మీడియాలో కూడా వైరల్ అయింది. ఆ ఫొటోను ‘అర్జున్ రెడ్డి సినిమా హీరో విజయ్ దేవరకొండ కూడా చూశాడు. ఆ ఫొటోను తన సోషల్మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ..‘తాతయ్య.. ఛిల్’ అని పోస్ట్ చేశాడు ఈ యువ హీరో.