సుమారు 60 ఏళ్లుగా పాలించిన గత పాలకుల వల్ల హైదరాబాదు నగరానికి పట్టిన దరిద్రం ఉట్టిగనే పోతదా?, మనదగ్గరేమన్న అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా చూమంతర్ అనంగనే హదరాబాదు మొత్తం ఒక్కసారిగా మారిపోవడానికి? అని మునిసిపల్ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో మూడేళ్లలో హైదరాబాదు నగరంలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని మంత్రి చెప్పారు. గతంలో హైదరాబాదులో ఎండాకాలం వస్తే నరకయాతన ఉండేది. కరెంటు, నీళ్ల కష్టాలు అన్నీ ఇన్ని కావని, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే నగరంలో ఎండాకాలం కష్టాలను తొలగించామని, 24 గంటల కరెంటు, ప్రతి రోజూ నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. ఇంకా రోడ్లు, ఫ్లైఓవర్లు, జంక్షన్లు వంటి ఎన్నో మౌళిక వసతులు సమకూరుస్తున్నామని, ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న ఎనిమిదేళ్లలో హైదరాబాదును విశ్వనగరంగా తయారు చేసి చూపెడతామన్నారు.
దశాబ్దాలుగా ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్న లక్షలాది మంది ప్రజలకు ఊరట కలిగించేలా బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఫ్లైఓవర్ ను ఇంకా పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఇవాళ బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే లాభమా..నష్టమా అనే చర్చ మూడున్నరేళ్ల క్రితం ఉండేది. ఆనాడు ఎన్నో అపోహలు.. అనుమానాలు..దుష్ప్రచారాలుండేవి. తెలంగాణ వస్తే ఆంధ్రావాళ్లను బతకనివ్వరని దుష్ప్రచారం చేశారన్నారు. మూడున్నరేళ్లలో ఒక్క సంఘటన కూడా జరగలేదని పేర్కొన్నారు.
హైదరాబాద్లో రోడ్లు, ఫ్లైఓవర్ కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంకా పదివేల కోట్ల ప్రతిపాదనలున్నాయి. త్వరలో నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రోరైల్ ప్రారంభిస్తాం. మెట్రో రైల్ రెండో దశ గురించి ఆలోచిస్తున్నాం. స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖను భూములు అడిగినట్లు కేటీఆర్ చెప్పారు. 2019లో తెలంగాణ ప్రజలు కేసీఆర్కే పట్టం కడతారని కాంగ్రెస్ నేతలందరికీ తెలుసునన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా ద్వారా 4100 యూనిట్లకు అనుమతులు ఇచ్చిమన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది. క్వాలిటీ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ బెస్ట్ సిటీగా ఉందన్నారు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే కరెంట్, నీళ్లకు గోస ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక ఆ రెండు సమస్యలు తొలగిపోయాయి. ఎండాకాలంలో సైతం కోతలు లేకుండా కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దని, తెలంగాణ వచ్చినంక కరెంట్ గోస పోయిందని కేటీఆర్ తెలిపారు. గతంలో ఖాళీ బిందెలు, కుండలతో విపక్షాలు ప్రదర్శన చేసేవి. మనది ఇంకా కొత్త సంసారమే..ఎన్నో సమస్యలున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహేందర్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ మల్లారెడ్డితోపాటు ఎమ్మెలే వివేక్, ఇతర ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.