50 కోట్ల రూపాయలతో సిరిసిల్లను హెల్త్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ, డయాలసిస్, బ్లడ్ బ్యాంకును మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్ కలిసి ప్రారంభించారు. సిరిసిల్లలో నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య విధానంలో పెను మార్పులు వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒకప్పుడు నేను సర్కార్ దవఖాను పోను బిడ్డ అనే పరిస్థితి ఉండేది.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత.. నేను సర్కార్ దవఖానకే పోత బిడ్డ అని చాలా మంది అంటున్నారని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కిట్ తో.. ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్యులకు నమ్మకం కలగాలంటే వైద్యులు అందుబాటులో ఉండాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రానికి అనుసంధానించాలని కలెక్టర్కు సూచించారు. సిరిసిల్లలో రూ. 36.50 కోట్లతో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసి వచ్చే సంవత్సరమే తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. సిరిసిల్లలో 100 పడకల ఆస్పత్రికి అదనంగా రూ. 13.50 కోట్లతో 50 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రానికి మంత్రి లక్ష్మారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు.