ముంబయి: ఇన్ఫోసిస్ సీఈవో పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేయడంతో క్రితం రెండు సెషన్లలో నష్టాలను చవిచూసిన స్టాక్మార్కెట్లు నేడు కాస్త కోలుకున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికీ.. మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.
క్రితం సెషన్లో 31,259 వద్ద ముగిసిన సెన్సెక్స్.. ఈ ఉదయం దాదాపు 170 పాయింట్ల లాభంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. అయితే ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకింగ్ షేర్లు నష్టాల్లో కొనసాగడంతో ఆ ప్రభావం సెన్సెక్స్పై పడింది. దీంతో ఆద్యంతం ఒత్తిడికి గురైన సూచీ.. చివరకు 33 పాయింట్ల స్వల్ప లాభంతో 31,292 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 11 పాయింట్లు లాభపడి 9,765 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 64.12గా కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో షేర్లు లాభపడగా.. ఎన్టీపీసీ, హీరోమోటోకార్ప్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టపోయాయి.