ఢిల్లీ: జియోఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్ను ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జియోకు దీటుగా చౌకధరల్లో ఫోన్లు తీసుకొచ్చేందుకు పలు మొబైల్ తయారీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్టెల్ కూడా ఈ జాబితాలో చేరింది. రూ.2,500కే 4జీ స్మార్ట్ఫోన్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీపావళికి ముందుగానే ఈ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
‘రూ.2500కే స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు కొన్ని మొబైల్ తయారీ సంస్థలతో ఎయిర్టెల్ చర్చలు జరుపుతోంది. మంచి తెర, కెమెరా, ఫీచర్ ఫోన్ కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది’ అని ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. అంతేగాక చర్చలు దాదాపు చివరిదశకు చేరాయని, సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదటివారంలో ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలున్నట్లు చెప్పారు.
లావా, కార్బన్ మొబైల్ సంస్థలతో ఎయిర్టెల్ చర్చలు జరుపుతున్నట్లుమార్కెట్ వర్గాల సమాచారం. అయితే దీనిపై అటు లావా గానీ.. ఇటు కార్బన్ గానీ స్పందించలేదు. మరోవైపు ఇలాంటి పుకార్లపై తాము స్పందించబోమని ఎయిర్టెల్ చెబుతోంది.ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోఫోన్ పేరుతో 4జీ ఫీచర్ ఫోన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ పూర్తిగా ఉచితమని.. అయితే సెక్యూరిటీ బాండ్ కింద రూ. 1500 చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది.