ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేన్సస్‌ ఘటనలో అడ్డుకున్న ఇయాన్‌ కు స్నేహితులైన లక్షలాది భారతీయులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 01:18 PM

 అమెరికాలోని కేన్సస్‌లో జాత్యహంకారంతో ఓ అమెరికన్‌ ఇద్దరు తెలుగు యువకులపై కాల్పులు జరపగా.. అదే సమయంలో మరో అమెరికన్‌ మానవత్వంతో కాల్పులను అడ్డుకోబోయిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనలో తెలుగు యువకులకు సహాయపడేందుకు ముందుకొచ్చి గాయాలపాలైన అమెరికన్‌ వ్యక్తి ఇయాన్‌ గ్రిల్లాట్‌ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు లక్షలాది భారతీయులు స్నేహితులయ్యారని చెప్పారు. మనుషులందరూ సమానమేనని.. ఎవ్వరినీ ఆ విధంగా చూడొద్దని ఇయాన్‌ జాత్యహంకారాన్ని వ్యతిరేకిస్తూ అన్నారు. ఆ సమయంలో నిందితుడిని అడ్డుకోవడం తప్ప తనకు మరో అవకాశం లేదనిపించిందని చెప్పారు. ‘నాకే అలాంటి పరిస్థితి ఎదురైతే.. ఎవరైనా సాయం వస్తే బావుంటుందని ఎలా ఆశిస్తానో.. అదే పని నేనిప్పుడు చేశా’నని ఇయాన్‌ పేర్కొన్నారు. ప్యురింటన్‌ చేసింది చాలా పెద్ద తప్పన్నారు.


ఓలెత్‌లోని బార్‌లో అమెరికన్‌ నేవీ మాజీ అధికారి ప్యురింటన్‌ ‘మా దేశం విడిచి వెళ్లిపోండి’ అంటూ తెలుగు యువకులపై జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్‌ కూచిభొట్ల మరణించగా, అలోక్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇయాన్‌ నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్యురింటన్‌ తుపాకీలో బుల్లెట్లు అయిపోయాయనుకుని.. అతడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ గన్‌లో ఇంకా బుల్లెట్లు ఉండడంతో అతడు ఇయాన్‌పైనా కాల్పులు జరిపాడు. దీంతో ఇయాన్‌ ఛాతీకి, చేతికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఇయాన్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com