హైదరాబాద్: నగరంలోని గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్ష ప్రభావం ఉప్పల్ ఏరియాలోని అధికంగా ఉంది. శ్రీనగర్ కాలనీ, స్వరూప్ నగర్లో కాలనీలు జలమయం అయ్యాయి. హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిలోమీటర్ మీర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమబెంగాల్, ఒడిషాకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఉంది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఉంది.
దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటలు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నాన్ స్టాప్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముందస్తు చర్యగా మరికొన్ని ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కొన్ని చోట్ల వైర్లు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. రోడ్లు కూడా నీట మునిగిపోవడంతో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నాచారం నుంచి హబ్సీగూడకు వెళ్లే ప్రధానమార్గం ఓ సముద్రంలా తలపిస్తోంది. ఆయా ప్రాంతాల నివాసితులు ఉద్యోగాలకు గానీ, పిల్లలు స్కూళ్లకు గానీ వెళ్లే పరిస్థితి లేదు.