హైదరాబాద్ : దుర్గామాత నవరాత్రుల సందర్భంగా విగ్రహాలను ఏర్పాటు చేసే మండపాల నిర్వాహకులు పోలీస్ క్లియెరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి తెలిపారు. ఈ నెల 21నుంచి 30 వరకు దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, అనంతరం అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పబ్లిక్ ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేసే ప్రతి మండప నిర్వాహకులు విగ్రహాల ఏర్పాటుకు, నిమజ్జనాలకు సంబంధించి ఆయా డివిజన్ ఏసీపీల నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిపికెట్ తీసుకోవాలని సూచించారు.
ఈ నెల 14 నుంచి 16 వరకు ఆయా పోలీస్స్టేషన్లలో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని, పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను 18వ తేదీ లోపు ఆయా పోలీస్ స్టేషన్లలో అందజేయాలని కోరారు.
* దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసేవారు ఎక్కడ, ఎప్పుడు మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు, ఏ రోజు ఏ రూట్లో నిమజ్జనానికి తరలిస్తున్నారు. మండపానికి, నిమజ్జనం చేసే ట్యాంక్బండ్కు ఉన్న దూరాన్ని దరఖాస్తు ఫారంలో తప్పని సరిగా రాయాలి. దీనివల్ల పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలి తదితర శాఖలకు ఏర్పాట్లపై అవగాహ ఉంటుందని వెల్లడించారు.
* మండపాన్ని ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించిన నో అబ్జక్షెన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) తప్పని సరిగా జతచేయాలి. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతలకు ఆటంకం లేని ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసుకోవాలి.
* విద్యుత్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి.
* లౌడ్స్పీకర్లకు అనుమతి ఉండదు
* నిర్వాహకులు తప్పనిసరిగా గుర్తింపుకార్డులు, బ్యాడ్జీలతో వాలంటీర్స్ను నియమించుకోవాలి.
* నిమజ్జనం సందర్భంగా ఉరేగింపు ర్యాలీలకు స్థానిక పోలీస్స్టేషన్ ద్వా రా ఏసీపీ అనుమతి తీసుకోవాలి.
* నిర్ణీత సమయం దాటిన తరువాత దరఖాస్తులు అనుమతించరు.
* మండపాల నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
* ఇళ్లు, అపార్టుమెంట్లు ప్రైవేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే వారు ర్యాలీలు, ఉరేగింపులు చేస్తే అందుకు సంబంధించిన పోలీస్ క్లియరెన్స్ తీసుకుంటే సరిపోతుంది.