నిరంతరం అణు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తోన్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను రెచ్చగొట్టేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. ఉత్తర కొరియా అణు పరీక్షలు నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జై ఇన్తో మాట్లాడారు. ఈ విషయం ట్రంప్ స్వయంగా వెళ్లడిస్తూ ... నేను దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్తో గత రాత్రి మాట్లాడాను. ... రాకెట్మెన్ ఎలా చేస్తున్నాడు. సుదూరాల నుంచి గ్యాస్ పైపు లైన్ నిర్మిస్తున్నాడా..? ఏం బాగోలేదు..!’ అని అన్నట్లు పేర్కొన్నారు.
జపాన్ మీదుగా ఖండాంతర క్షిపణిని, అత్యంత శక్తివంతమైన అణు పరీక్షలు నిర్వహించిన కొద్ది రోజులకే ట్రంప్ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ట్రంప్ సలహాదారులు తీరు మార్చుకోవాలని ఉత్తరకొరియా హెచ్చరికలు జారీ చేసింది. కొరియా ద్వీపకల్పంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఉత్తర కొరియాపై బలమైన చర్యలు తీసుకోవడానికి ట్రంప్, మూన్ జై అంగీకరించినట్లు దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ అణు పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాలని కోరుతూ అమెరికా తీసుకొచ్చిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. దీని వల్ల ఉత్తర కొరియాకు సహజవాయువులతోపాటు ఇతర ఎగుమతులను, దిగుమతులు నిలిచిపోయాయి. దౌత్యపరంగా ఒంటరిగా చేసి, ఆర్థికంగా దెబ్బతీయడం వల్ల కిమ్ జోంగ్ దూకుడు తగ్గతుందని భావిస్తున్నారు.
మరోవైపు ఐరాసలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ మాట్లాడుతూ..... ఉత్తరకొరియాకు ఆంక్షల తీవ్రత ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ ఆంక్షల వల్ల ఆ దేశానికి ప్రపంచ దేశాలతో సంబంధాలు దాదాపు తెగిపోయాయి. దౌత్య, సైనికేతర పరిష్కాలకు మార్గాలు దూరమైపోతున్నాయి. ఉత్తరకొరియా తన వైఖరిని ఇలాగే కొనసాగిస్తే అమెరికా తనను తాను, మిత్రదేశాలను రక్షిస్తుంది. ఈ క్రమంలో ఉత్తరకొరియా ధ్వంసమైపోవచ్చు. మాకు అన్ని మార్గాలు తెలుసు.. కానీ మాలో ఎవరూ యుద్ధం కోరుకోవడంలేదు. కానీ యుద్ధం చేయాల్సి వచ్చేట్లే ఉంది.’ అని వ్యాఖ్యానించారు.