సింగరేణిలో పనిచేస్తున్న జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీల ప్రతినిధులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిశారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలిసిన జీఎంఇటి ట్రైనీ లు తమ సమస్యలను వివరించారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం 811 మందిని జీఎంఇటి ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని, పాలిటెక్నిక్ డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తో పాటు 17 ఏళ్ళ వయసున్న వారికి సైతం మానవతా దృక్పథంతో వయస్సు నిబంధనలు సడలించి అవకాశం కల్పించారని తెలిపారు. మీ కృషి వల్లే తాము పోస్టులో జాయిన్ అయ్యామని ఈ సందర్భంగా వారు ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రేడ్-సి కేడర్ లో జాయిన్ అయిన జీఎంఇటి ట్రైనీలకు గ్రేడ్-బి ఓవర్ మెన్ లుగా ప్రమోట్ అయ్యేందుకు 5 ఏళ్లు సర్వీస్ తప్పనిసరి. ఈ నిబంధనను సడలించి 2 ఏళ్లకు తగ్గించేలా చూడాలని వారు ఎంపీ కవితను కోరారు. ఎఎంఐఈ చదువుకునేందుకు ఎన్ఓసీ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. డిజిఎంఎస్ ధన్ బాద్ నిర్వహించే గ్యాస్ టెస్టింగ్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యేందుకు 20 ఏళ్లు వయస్సు నిబంధన వల్ల తక్కువ వయస్సు కలిగిన ట్రైనీలు ఆ పరీక్షకు హాజరయ్యే అవకాశం కోల్పోతారని, ఈ నిబంధనను సడలింప చేయాలని కోరారు. జీఎంఇటి ట్రైనీల సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ కవిత వారికి హామీ ఇచ్చారు. ఎంపీ కవితను కలిసిన వారిలో జీఎంఇటి ట్రైనీల నాయకులు ఏనుగు లక్ష్మణ్, సాయికిరణ్, విష్ణు కుమార్, ఫిలోమన్, అఖిల్, రఘు, పాషా, రవి ఉన్నారు.