తెలంగాణ ఇంద్రకీలాద్రి వరంగల్ శ్రీభద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీదేవీశరన్నవరాత్రుల మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే నవరాత్రి మహోత్సవాల కోసం ఆలయ పరిసరాలను సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు సర్వ దర్శనాలు కల్పిస్తారు. సర్వ దర్శనము, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, విఐపీల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆర్.సునీత తెలిపారు. గురువారం ఉదయం నుంచే ఉత్సవానుజ్ఞ ప్రార్థన, గోబ్రాహ్మణ పూజ, జగద్గురు శంకరాచార్య పూజ, గణపతి పూజలు నిర్వహిమని ప్రధానార్చకుడు భద్రకాళి శేషు చెప్పారు. గురువారం ఉదయం అమ్మవారికి వృషభ వాహన సేవ, సాయంత్రం మృగ (జింక) వాహన సేవలుంటాయని వివరించారు. శ్రీదేవీశరన్నవరాత్రులను పురస్కరించుకుని రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో శ్రీభద్రకాళి ఉత్సవమూర్తికి విశేషాలంకరణ చేసి వాహనసేవలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరుగుతాయని వెల్లడించారు.