ముంబయి: దేశీయ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫెడ్ రేట్లను యధాతథంగా కొనసాగిస్తున్నట్లు అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆరంభ ట్రేడింగ్లో సూచీలు లాభాలతో సాగినప్పటికీ.. బ్యాంకింగ్, ఆటోమొబైల్, చమురు రంగాల కంపెనీల షేర్లు కుదేలవడంతో మధ్యాహ్నానికి నష్టాల్లోకి జారుకున్నాయి.
ఈ ఉదయం 42 పాయింట్ల లాభంతో 32,443 వద్ద సెన్సెక్స్ ఉత్సాహంగా ప్రారంభమైంది. అయితే బ్యాంకింగ్, ఆటోమొబైల్ తదితర కంపెనీల షేర్లు కుదేలవడంతో ఒత్తిడికి గురైన సూచీ నష్టాల్లోకి జారుకుంది. ఒకానొక దశలో 80 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్.. చివరకు కాస్త కోలుకుని 30 పాయింట్ల నష్టంతో 32,370 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 19 పాయింట్లు నష్టపోయి 10,122 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.64.78గా కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి. ఒక్కో షేరు విలువ 7శాతం వరకు పెరిగింది. అటు సిప్లా, లుపిన్, టెక్మహీంద్రా, సన్ఫార్మా షేర్లు కూడా లాభపడగా.. జీ ఎంటర్టైన్మెంట్, గెయిల్, ఏసీసీ లిమిటెడ్, ఐషర్ మోటార్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు నష్టపోయాయి.