నవంబర్ లో హైదరాబాద్ మెట్రోరైలుని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పనుల పురోగతిని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. మెట్రోరైలు ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైన సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్జిని ఆయన సందర్శించారు. సుమారు 11 వేల టన్నుల ఉక్కు ఉపయోగించి రైల్వే ట్రాక్స్ మీదుగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సమీపంలో రైల్వే ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ట్రాక్ మీదుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ తర్వాత సమీపంలోని పలు మెట్రో రైలు స్టేషన్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మెట్రోరైలు పనులు చేస్తున్న కార్మికులను ఆప్యాయంగా పలకరించారు. వారితో కరచాలనం చేశారు. కార్మికులు మంత్రితో ఫోటోలు దిగారు. నవంబర్ నెల మధ్యకల్లా నాగోల్-మియాపూర్ మధ్య సుమారు 30 కిలోమీటర్ల మెట్రోరైలు మార్గాన్ని సిద్ధం చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.మంత్రి కేటీఆర్ వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టి అధికారులు ఉన్నారు.