మాజీ సీఎం జయలలిత మరణంపై విచారణ కోసం మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఏ ఆర్ముగస్వామిని తమిళనాడు ప్రభుత్వం నియమించింది. గత నెల 17నే జయ మరణంపై న్యాయ విచారణ జరపనున్నట్లు సీఎం పళనిస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు జడ్జి పేరు మాత్రం ప్రకటించలేదు. సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం వర్గాల విలీనానికి ఉన్న ప్రధాన డిమాండ్లలో జయ మరణంపై విచారణ కూడా ఒకటి. గతేడాది డిసెంబర్ 5న జయలలిత హార్ట్ ఎటాక్తో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై సీబీఐ విచారణ జరపాలని పన్నీరుసెల్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న తనను కూడా జయను చూడటానికి అనుమతించలేదని ఆరోపించారు.