ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కావలసిన 220 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం పనులు అక్టోబర్ చివరికి పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆ శాఖ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 33 కేవీ విద్యుత్ టవర్ లలో పూర్తి కాకుండా మిగిలిపోయిన 1 టవర్ నిర్మాణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ కోరారు. స్పెషల్ డ్రైవ్ చేస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. డిసెంబర్ లో డ్రై రన్ నిర్వహించవలసిందేనని, ఎలాంటి అలసత్వం సహించబోమని హరీశ్ రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిన ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మళ్ళీ పట్టాలపైకి ఎక్కించిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తాగునీటి, సాగునీటి పథకాల పురోగతిని సీఎం కేసీఆర్ ప్రతి వారం సమీక్షిస్తున్నట్టు హరీశ్ రావు తెలిపారు. కీలకమైన ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులు, ఏజెన్సీని కోరారు. కాంగ్రెస్ హయాంలో పంపులు, మోటార్ల కొనుగోళ్ళు తప్ప సర్జ్ పూల్ నిర్మాణం, కాలువల తవ్వకాలు, సివిల్ పనులేవీ సాగలేదన్నారు.