దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సలహా మండలిని సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ప్రముఖ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలో ఈ సలహా మండలిని ఏర్పాటుచేశారు. ఈ మండలిలో సభ్యులుగా డాక్టర్ సూర్జిత్ బళ్లా, రతిన్ రాయ్, డాక్టర్ అషీమా గోయల్, సభ్య కార్యదర్శిగా రతన్ వటల్ నియమితులయ్యారు. ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలపై ఈ మండలి ప్రధానికి సలహాలు ఇవ్వనుంది. దేశంలోని కీలక అంశాలపై ప్రధాని కోరినా లేదా సుమోటోగానైనా వివిధ అంశాలపై సూచనలివ్వనుంది. ప్రధాని కోరిక మేరకు సమయానుకూలంగా నివేదికలను సైతం రూపొందిస్తుంది.