నిర్మల్: బాసర, భద్రాద్రి పుణ్యక్షేత్రాలకు భక్తులు భారీగా పోటెత్తారు. వేకువజాము నుంచే గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజైన నేడు సరస్వతి అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేద పండితులు వేకువజాము నుంచి వేద పారాయణం నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు చండీయాగం. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవార్లకు మహానివేదన. రాత్రి 8 గంటలకు అమ్మవార్లకు మహాహారతి కార్యక్రమాల నిర్వహణ జరగనుంది. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అదేవిధంగా భద్రాద్రి పుణ్యక్షేత్రంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు సామూహిక లక్ష తులసి కుంకుమార్చనను చేపట్టనున్నారు.