హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు 'స్వచ్ఛతే సేవ' కార్యక్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్... శివసేన యూత్ వింగ్ లీడర్, ముంబై డివిజినల్ పుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిత్య థాకరే పాల్గొన్నారు. ఇందులో భాగంగా మంళవారం ఉదయం పశ్చిమ ముంబైలోని బాంద్రా పోర్ట్ వీధులను శుభ్రం చేశారు. వీరితో పాటు బృహాన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) స్వీపర్లు, పలువురు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సచిన్ మీడియాతో మాట్లాడాడు. 'మేమంతా కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నాం. మీరు కూడా మీ స్నేహితులతో కలిసి ‘స్వచ్ఛతే సేవ' కార్యక్రమంలో భాగంగా వీధులను శుభ్రం చేయాలి' అని సచిన్ అభిమానులకు పిలుపునిచ్చాడు. మరోవైపు ఆదిత్య థాకరే కూడా ఈ ‘స్వచ్ఛతే సేవ' కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. 'ముంబై సిటీని క్లీన్ ఉంచేందుకు మన బీఎంసీ స్వీపర్లు రాత్రింబవళ్లు ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు నేను, సచిన్ వారికి కొంతమేర సాయపడ్డాం' అని ట్వీట్ చేశాడు. ఇక, ‘స్వచ్ఛతే సేవ' కార్యక్రమంలో పాల్గొనాలని దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మోడీ తలపెట్టిన ఈ కార్యక్రమం నచ్చి కొందరు సెలబ్రిటీలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నారు.