దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో ఓ సినిమా చేయాల్సివుంది. ఆయనతో కలిసి పనిచేసే క్షణాల కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని అన్నారు మహేష్బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం స్పైడర్. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఎన్వీప్రసాద్ నిర్మాత. రకుల్ప్రీత్సింగ్ కథానాయిక. ఈ నెల 27న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్లో మహేష్బాబు పాత్రికేయులతో ముచ్చటిస్తూ తెలుగు, తమిళంతో పాటు అరబిక్, మలయాళంలో ఈ సినిమాను విడుదలచేస్తున్నాం. నా కెరీర్లో పెద్ద సినిమా ఇది. వినూత్న కథాంశంతో తెరకెక్కింది. తెలుగు, తమిళం రెండు మార్కెట్లను సంతృప్తిపరిచేలా సినిమా చేయడం చాలా కష్టం. మురుగదాస్ అనుభవం అందుకు ఎంతగానో ఉపయోగపడింది. భవిష్యత్తులో దర్శకుల ప్రతిభను బట్టే ద్విభాషా చిత్రాలు చేస్తాను. మా అబ్బాయి గౌతమ్కు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. ఇందులోని పోరాట ఘట్టాలు వాడికి నచ్చుతాయని అనుకుంటున్నాను. సితారకు పాటలు బాగా నచ్చాయి. నా దృష్టిలో ఎక్కడైనా దర్శకుల పనితీరు ఒకేలా ఉంటుందనుకుంటున్నాను. రాజమౌళితో తప్పకుండా సినిమా చేస్తాను. ప్రస్తుతం అంగీకరించిన సినిమాలు పూర్తికాగానే ఆయన దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాం. నమత్ర స్పైడర్ సినిమా ఇంకా చూడలేదు. కానీ నేను మాత్రం 150 సార్లు చూశా అని అన్నారు.