గిరిజనులను ఏపీ సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆరోపించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలి జన్మభూమి కమిటీలా ఉందని విమర్శించారు. ఒక్క ఎస్టీ ఎమ్మెల్యేకు కూడా కమిటీలో స్థానం కల్పించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తన కుట్రలు, కుతంత్రాలు అమలు చేసేందుకే గిరిజన సలహా మండలిలో తన తొత్తులను నియమించుకున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి గిరిజన సలహా మండలి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అన్ని పార్టీల నేతలకు కమిటీలో స్థానం కల్పించారని, కానీ చంద్రబాబు ఏకపక్షంగా కమిటీని నియమించారని పేర్కొన్నారు. ప్రత్యేక విమానాల్లో తిరడానికి, తన ఇల్లు మరమ్మతులకు డబ్బులుంటాయి కానీ గిరిజనులకు ఇచ్చేందుకు చంద్రబాబు దగ్గర నిధులు ఉండవని ధ్వజమెత్తారు. ఏజెన్సీలో ఇప్పటికీ కరెంట్, రోడ్లులేని గ్రామాలున్నాయని బాలరాజు తెలిపారు. ఇవన్నీ గిరిజనులు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో చంద్రబాబుకు గుణపాఠం చెబుతారని అన్నారు.