రాజధాని నగరంలో రాత్రయితే చాలు.. వందలాది కాలనీలు భీతిల్లుతున్నాయి. వరద ముంపు ఎక్కడ ముంచుకొస్తుందోననే భయాందోళన కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గత సోమవారం గంట వ్యవధిలో మాదాపూర్లో 6.5సెం.మీల వర్షపాతం నమోదు కాగా.. గురువారం రాత్రి శ్రీనగర్ కాలనీలోనూ అంతే వర్షం పడింది. కాస్త అటుఇటుగా గత పది రోజులుగా నగరంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికే అనేక కాలనీలు వరద నీటిలోనే ఉంటున్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉండగానే.. గురువారం వర్షం మరిన్ని వెతలను తెచ్చింది. ఖైరతాబాద్, శ్రీనగర్కాలనీ, పంజాగుట్ట, తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఈ ప్రాంతాల్లో గంట వ్యవధిలోనే అత్యధికంగా 6.4 సెం.మీల కుంభవృష్టి కురవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఏకధాటిగా వచ్చిన వాన నీటితో అబిడ్స్ నుంచి కూకట్పల్లి వరకు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ 5 గంటలపాటు స్తంభించింది. హిమాయత్నగర్లో వాహన చోదకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ట్రాఫిక్లో లక్షలాది వాహనాలు చిక్కుకున్నాయి. జనం నీటిలోనే నరకం చూశారు. పంజాగుట్ట మోడల్ హౌజ్ కూడలి ఎప్పటిలాగే చెరువును తలపించింది. ఎగువ నుంచి వచ్చిన వరదతో మోకాళ్ల లోతున నీరు చేరింది. అటు, ఇటు వాహనాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది.
* వర్షాలు మొదలై నెల రోజులకుపైగా అవుతుంది. అప్పట్నుంచి మల్కాజిగిరిలోని ఈస్ట్ ఆనంద్బాగ్వాసులు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఒక్క రోజు కూడా కాలనీల్లోని నీటి చెమ్మ ఆరలేదంటున్నారు. గురువారం వర్షంతో మళ్లీ కాలనీల్లోకి నీరు ప్రవేశించిందని ఎన్ఎండీసీకాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
* సికింద్రాబాద్ పరిధిలోని లాలాపేట, పద్మారావునగర్, చిలకలగూడ, రాంనగర్లో నాలా పరివాహక ప్రాంతాలు వరద ప్రవాహానికి గురయ్యాయి. కాలనీల్లో మోకాల్లోతున నీరు ప్రవహించింది. ముషీరాబాద్లోనూ కాలనీలు జలమయమయ్యాయి. రామంతాపూర్ పెద్దచెరువు పరిధిలోని కాలనీలు మరోసారి భయాందోళనలో పడ్డాయి. రవీంద్ర నగర్, లక్ష్మినగర్, తదితర ప్రాంతాలవాసులు నీళ్లలోనే మగ్గుతున్నారు.
* అంబర్పేటలో భారీ వర్షపాతం నమోదు కావడంతో కాలనీల్లో వరద ఉధృతంగా ప్రవహించింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో ముసారాంబాగ్ వద్దనున్న మూసీ నది వంతెనపైనా వరద నీరు పోటెత్తింది. వంతెన దాటేందుకు వాహన చోదకులు అవస్థలు పడ్డారు.
* ఖైరతాబాద్ పెద్ద గణేశ్ మార్గంలో వరద ఉధృతికి రహదారి గురువారం కుంగిపోయింది. గత పది రోజులుగా సీతాఫల్మండి, పద్మారావునగర్, కూకట్పల్లి, మియాపూర్, తదితర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. ్ద వారం రోజులుగా హుస్సేన్ సాగర్కు ఇన్ఫ్లో గణనీయంగా పెరిగింది. దాంతో ఇది నిండుకుండలా తొణికిసలాడుతోంది. జీహెచ్ఎంసీ నీటిపారుదల విభాగం అధికారులు అదనపు జలాలను కిందకు వదిలేస్తున్నారు. సర్ప్లస్ నాలా మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.