వరంగల్ అర్బన్ : కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అగ్రగామి నిలువబోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హరిత హోటల్లో సీఎం వరంగల్ పర్యటనపై నాయకులతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బడ్జెట్ లో నేరుగా కార్పోరేషన్ లకు నిధులిచ్చే ఆనవాయితీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇతర రాష్ట్రాలలో ఉన్న టెక్స్ టైల్ రంగం కార్మికులకు రెండింతల పని, వేతనంతో ఉన్న ఊళ్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. అపార అనుభవం గల స్కిల్డ్ లేబర్ అందర్నీ రప్పిస్తాని వెల్లడించారు.
ఫాం టూ ఫ్యాషన్ సూత్రంతో టెక్స్ టైల్ పరిశ్రమ నెలకొల్పుతున్నామని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో లభించే అన్ని రకాల వస్ర్తాలు ఇక ఒకే చోట తయారీ జరుగుతుందని పేర్కొన్నారు. వికేంద్రీకరణ లో భాగంగా వరంగల్ మరో ఆర్దిక రాజధాని అవుతుందని తెలిపారు. దేశంలోనే నాణ్యమైన పత్తి ఉత్తర తెలంగాణ లో పండుతుందని పరిశోధనలో తేలింది. టెక్స్ టైల్ పార్కు తో పాటు పారిశ్రామిక ప్రాంతంతో వరంగల్ నగర విస్తరణకు అనుకూలంగా ఉందన్నారు. హైదరాబాద్ నుండి వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూ.667 కోట్లతో టెక్స్ టైల్ మొదటి దశ పనులు జరుగుతాయని, 1.20 లక్షల మందికి ఉపాది అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. టెక్స్ టైల్ కళాశాల స్థాపనకు కోయంబత్తూరు కళాశాలతో ఎంఓయు కుదుర్చుకుంటున్నాట్లు చెప్పారు.
ఈ నెల 22న 12 కంపెనీలతో సీఎం సమక్షంలో ఒప్పందాలు చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల స్టంట్ కాకుండా ఏడాదిలోగా పనులు పూర్తవుతాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా ప్రణాళికల రూపకల్పనలు చేసినట్లు పేర్కొన్నారు. ఫ్యాషన్ రంగంలో నిఫ్ట్ తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.