హైదరాబాద్: రేవంత్రెడ్డికి పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యాడని.. అందుకే పార్టీ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్రెడ్డి వల్లనే పార్టీ భ్రష్టు పట్టిందన్నారు. ఆయన వెళ్లిపోతే తెలంగాణలో తెదేపా మరింత బలపడుతుందని వ్యాఖ్యానించారు. 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఆయన వైఖరి నచ్చకే వెళ్లిపోయారని ఆరోపిచారు. పొలిట్ బ్యూరో సమావేశంలో తనకు రేవంత్కు వాగ్వాదం జరిగిందని తెలిపారు. రేవంత్ సరైన సమాధానం చెప్పకపోవడంతో తాను, అరవింద్కుమార్ గౌడ్ సమావేశం బహిష్కరించి బయటకు వచ్చేసినట్లు మోత్కుపల్లి మీడియాకు తెలిపారు. రేవంత్ కాంగ్రెస్ చేరితే ఆ పార్టీ కూడా భ్రష్టుపట్టిపోతుందన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు గ్రహించాలని హితవు పలికారు.