దేశంలో అత్యంత విశ్వసనీయ బ్రాండుగా గూగుల్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్కు అగ్రస్థానం దక్కింది. ప్రస్తుత సంవత్సరానికి విశ్వసనీయ బ్రాండ్లపై న్యూయార్క్కు చెందిన కోహన్ అండ్ వూఫే సంస్థ అధ్యయనం నిర్వహించింది. భారత్లో విశ్వసనీయత బ్రాండ్లకు సంబంధించి గూగుల్ తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మారుతీ సుజుకీ, యాపిల్ నిలిచాయి. ఇవే కాకుండా సోనీ, యూట్యూబ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, బ్రిటీష్ ఎయిర్వేస్లు తొలి పది సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. బ్రాండు విశ్వసనీయతను అంచనా వేసే విషయంలో భారత వినియోగదారులు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది. మొత్తం 1400 బ్రాండ్లపై ఈ ఏడాది మే, జూన్లో కోహన్ అండ్ వూఫే రెండు దశల్లో అధ్యయనం నిర్వహించింది. ఇందులో బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, హాంగ్కాంగ్, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, సింగపూర్, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, అమెరికా దేశాలకు చెందిన 15,000 మందికి పైగా వినియోగదారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అధ్యయనానికి సంబంధించి మరికొన్ని వివరాలు ఇలా..
*భారత్లో 67% మంది వినియోగదారులు ఫలానా బ్రాండు నమ్మదగినదని భావిస్తేనే కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నట్లు అధ్యయనంలో తేలింది.
*భారత్లో పారదర్శక, నమ్మదగిన బ్రాండ్ల వైపు మొగ్గు చూపుతున్నవారు 37% మంది. ఈ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు 22 శాతమే.
*కార్యకలాపాలకు బ్రాండ్లే పూర్తి స్థాయి బాధ్యతను వహించాలని 38% మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా సగటున 25 శాతం మంది మాత్రమే పైవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
*ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో అమెజాన్ తర్వాతి స్థానాల్లో యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, పేపాల్ నిలిచాయి.
*ప్రపంచంలో అత్యుత్తమ తొలి పది విశ్వసనీయ బ్రాండ్లలో 70 శాతం సాంకేతికత రంగానివే కావడం గమనార్హం.