17 ఏళ్ల తర్వాత భారత్కు ప్రపంచ సుందరి కిరీటం అందించి, దేశపతాకాన్ని రెపరెపలాడించిన మానుషి చిల్లార్పై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మానుషి నుద్దేశించి థరూర్ చేసిన చిల్లర వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు వ్యవహారాన్ని మానుషితో ముడిపెట్టడంతో థరూర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసేందుకు సిద్ధమైంది. పెద్ద నోట్లను రద్దుచేసి బీజేపీ ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసిందో ఇప్పటికైనా గుర్తించితే మంచిది... మన ‘చిల్లర’కు ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ‘చిల్లర్’ ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడంతోనే అది రుజువైందని మానుషిని చిల్లరగా పోల్చుతూ ట్వీట్ చేశారు.
దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన మానుషి చిల్లార్ను చిల్లర వ్యక్తిగా పోల్చిన శశిథరూర్పై జనం మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలతో తాను చిల్లర వ్యక్తి అని మరోసారి నిరూపించుకున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. థరూర్ వ్యాఖ్యలు బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టినట్టు ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు. మానుషి జాట్ కులానికి చెందిన వ్యక్తి కావడంతో శశిథరూర్ మొత్తం జాట్లనే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానుషి నుద్దేశించి శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మానుషి విజయాన్ని తక్కువ చేసిన థరూర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.