ముంబై: దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో కోడిగుడ్ల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పౌల్ట్రీ ఫామ్ల నుంచి గుడ్ల సరఫరా చాలా తక్కువగా ఉన్నందువల్ల గుడ్ల ధరలు 40శాతం పెరిగాయని పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రమేశ్ కత్రి వెల్లడించారు. గుడ్ల సరఫరా పరిమితంగా ఉండటంతో రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.7 నుంచి 7.50 వరకు చేరిందని ఆయన తెలిపారు. మరికొన్ని నెలల వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశముందని, దీంతో గుడ్ల ఉత్పత్తి 25-30 శాతం వరకు తగ్గే అవకాశముందని ఆయన వెల్లడించారు. గత ఏడాది పౌల్ట్రీ ఫామ్స్ నష్టాలను చవిచూసిన నేపథ్యంలో..దాని ప్రభావంతో ఈ ఏడాది కొంతమంది పౌల్ట్రీ ఫామ్స్ మూసివేసే అవకాశముందని, దీని ప్రభావంతో ఉత్పత్తి తగ్గనున్నట్లు వెల్లడించారు. వింటన్ సీజన్ నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్లో గుడ్లకు డిమాండ్ అధికంగా ఉందని ముంబైకి చెందని గుడ్ల వ్యాపారి వెల్లడించారు.