హైదరాబాద్: మహా నగరాన్ని విషజ్వరాలు పట్టేశాయి. రోజు రోజుకు డెంగీ విస్తరిస్తోంది. ఏ ఆస్పత్రిలో చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. పిల్లా, పెద్ద అంతా పడకేశారు. చలి పులితోపాటు డెంగ్యూ కూడా పంజా విసురుతోంది. కలరా, టైపాయిడ్, మలేరియా జ్వరాలతోపాటు డెంగ్యూ, చికెన్ గునియా, స్వైన్ఫ్లూ వంటివి వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా విషజ్వరాల పీడితులే కనిపిస్తున్నారు. హైదరాబాద్లో నవంబర్లో 117 డెంగ్యూ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 2467 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. దీంతో చిన్నా, పెద్దా అంతా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో డెంగ్యూ మరింత చెలరేగే ప్రమాదం ఉంది. డెంగ్యూ జ్వరం సోకినవారికి తలనొప్పి, వాంతులు, విరోచనాలు, కాళ్లనొప్పులు ఇబ్బంది పెడతాయి.