హైదరాబాద్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం(సెర్ప్) ఉద్యోగులు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటిని ముట్టడించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ అత్తాపూర్లోని మంత్రి నివాసానికి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సెర్ప్ ఉద్యోగులతో మాట్లాడిన మంత్రి జూపల్లి వారి ఆందోళనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అయితే నాలుగేళ్లుగా ఇదే మాట చెబుతున్నారంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మహిళా ఉద్యోగులు మంత్రి కాళ్లు పట్టుకున్నారు. లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ వారు మంత్రి ఇంటి వద్ద బైఠాయించారు.