న్యూఢిల్లీ : విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు చిత్తుశుద్ధితో ఉన్నామని కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ స్పష్టం చేశారు. ఉద్యోగభవన్లో గనుల కేటాయింపుపై కేంద్రమంత్రి చౌదరి బీరేంద్రసింగ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం బీరేందర్ సింగ్ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై టాస్క్ఫోర్స్ కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు. ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా ఏ తరహా చర్యలు తీసుకోవాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగిందని తెలిపారు. ఉక్కు నాణ్యత అధ్యయనానికి టాస్క్ఫోర్స్ కమిటీకి సమయం పడుతున్నదన్నారు. నెల రోజుల తర్వాత మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశం ప్రారంభానికి ముందు మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం చేనేత వస్త్ర్రంతో తయారు చేసిన చొక్కాను ఆయనకు మంత్రి కేటీఆర్ బహూకరించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి, మంత్రి కేటీఆర్, ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్కుమార్, ఏపీ మంత్రి సుజయకృష్ణ పాల్గొన్నారు.