హైదరాబాద్ : పాతబస్తీ, ఫలక్నుమా పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్ హైదరాబాద్కు రానున్న సందర్భంగా పాతబస్తీలో 300 మంది పోలీసులతో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. మోదీ, ఇవాంక పర్యటనకు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేసినట్టు హైదరాబాద్ సీపీ శ్రీనివాసరావు తెలిపారు. సుమారు 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలక్నుమా ప్యాలెస్, గోల్కొండ కోట ప్రాంతాల్లో పటిష్ట నిఘా పెట్టామన్నారు. ఈ నెల 27 నుంచి గోల్కొండ కోటలో సందర్శకులకు అనుమతి ఉండదన్నారు. మోదీ, ఇవాంక పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు చెప్పారు. భద్రతా ఏర్పాట్ల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇవాంక భద్రత ఏర్పాట్లపై అమెరికా సీక్రెట్ ఏజెన్సీతో గంటపాటు చర్చించినట్లు వెల్లడించారు. హెచ్ ఐసీసీ, ఫలక్ నుమాకు ప్రతినిధులను తీసుకెళ్లేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ, ఇవాంక ట్రంప్ , ఇతర అతిథులకు ఫలక్ నుమాలో విందు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సదస్సుకు వచ్చే మరికొందరు ప్రతినిధులకు గోల్కొండ కోటలో విందు ఏర్పాట్లు చేశామన్నారు. ఇవాంక ట్రంప్ ఈ నె 29న తిరిగి అమెరికాకు బయలుదేరుతారన్నారు.