మహబూబ్నగర్ జిల్లాలోని మూసాపేట్ మండలం నిజాలపూర్ గ్రామానికి వైద్య ఉపకేంద్రం మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. అదేవిధంగా జడ్చర్లకు, దేవరకద్రకు ఫైర్ స్టేషన్లు మంజూరైనట్లు వెల్లడించారు. నిజాలపూర్ గ్రామంలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన 20 డబుల్ బెడ్రూం ఇండ్లకు మంత్రి నేడు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏమేం చేయగలమో అదంతా ప్రభుత్వం చేస్తున్నదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యాలను నిజాలపూర్లో ప్రజలు సాధించి చూపిస్తున్నారని కొనియాడారు. నిజాలపూర్లా రాష్ట్రంలోని గ్రామాలు ఆదర్శంగా నిలవాలని కోరారు. గ్రామంలో 100 శాతం పారిశుద్ధ్య ప్రగతి ఉందని తెలిపారు. సీఎం గ్రామ పంచాయతీ నూతన చట్టానికి రూపకల్పన చేస్తురని.. కొత్త చట్టం ద్వారా గ్రామాలు మరింత బలోపేతం అవుతాయని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని వెల్లడించారు. ఇవన్నీ ప్రతిపక్ష పార్టీలకు గిట్టడం లేదని విమర్శించారు. ప్రజల అభివృద్ధికి పాటు పడుతున్న ప్రభుత్వ పనులకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్నారు. ఎవరేం చేస్తున్నారో ప్రజలు గుర్తించాలన్నారు. ప్రగతికి పాటు పడుతున్న ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు.