రాజన్న సిరిసిల్ల: అన్ని రకాల ప్రభుత్వ సంస్థలకు అవసరమయ్యే వస్ర్తాల ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఐటీ, చేనేత జౌళిశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లాలో ఆధునిక పవర్లూం మేళాను మంత్రి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హ్యాడ్లూంకి పవర్లూంకి తేడా తెలియనివారు గతంలో ప్రభుత్వాన్ని నడిపారన్నారు. చేనేత మిత్రం పథకంలో అవకతవకలు తలెత్తకుండా.. నేత కార్మికులకు నష్టం కలగకుండా ప్రతి మగ్గానికి జియో ట్యాగింగ్ చేస్తూ కోడ్లను కేటాయించడం జరిగిందన్నారు. మరమగ్గాల ఆధునీకరణలో భాగంగా మొదటి విడతలో రూ. 30 కోట్లతో 15 వందల మగ్గాలతో మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక మరమగ్గాలకు కేంద్రం 50శాతం సబ్సిడీ ఇస్తే నేతన్నలపై భారం పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిగతా 50 శాతాన్ని చెల్లిస్తుందని చెప్పారు. నేతన్నలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. అప్పుడు మాత్రమే ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.