పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ సమావేశాల జాప్యంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో గుజరాత్ ఎన్నికల రెండో దశ పోలింగ్ పూర్తయిన మరుసటి రోజు అంటే.. డిసెంబర్ 15 నుంచి జనవరి 5వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) ఈ రోజు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారల శాఖ మంత్రి అనంత్కుమార్ మీడియాకు వెల్లడించారు.
ప్రజా సంక్షేమం దృష్ట్యా అనేక కీలక అంశాలపై చర్చించాల్సి ఉందని, కీలక బిల్లులు సైతం సభ ముందుకు రానున్నందున సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అనంత్కుమార్ కోరారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను వాయిదా వేశారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిందేమిటని ప్రశ్నించారు. ఈ సమావేశాల్లో ముమ్మారు తలాక్, ఎన్సీబీసీ తదితర ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా జీఎస్టీ (రాష్ట్రాలకు పరిహారం) ఇచ్చే ఆర్డినెన్స్తో పాటు బ్యాంకుల్లో అప్పులకు సంబంధించిన దివాలా చట్టం, భారత అటవీ సవరణ చట్టం ఆర్డినెన్స్లను ఆమోదం తెలిపే అవకాశం ఉంది.