భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో భారత బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటి రోజు ఆట ఆరంభంలో పేసర్ ఇషాంత్ శర్మ విజృంభించగా.. ఆఖర్లో స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్ శ్రీలంక బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక కరుణరత్నె(51: 147 బంతుల్లో 6×4), దినేశ్ చండీమాల్(57: 122 బంతుల్లో 4×4, 1×6) రాణించడంతో శ్రీలంక జట్టు 79.1 ఓవర్లలో అన్ని వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
రెండో టెస్టులో జట్టులోకి వచ్చిన ఇషాంత్ శర్మ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో లంక ఓపెనర్ సమరవిక్రమ(13)ను ఆరంభంలోనే పెవిలియన్ పంపి వికెట్ల ఖాతా తెరిచాడు. పేసర్లు ఇషాంత్, ఉమేశ్ యాదవ్ల పదునైన బంతులను ధాటిగా ఎదుర్కొంటూ మరో వికెట్ పడకుండా లంక బ్యాట్స్మెన్ జాగ్రత్తపడ్డారు. ఓపెనర్ కరుణరత్నె సంయమనం కోల్పోకుండా అడ్డుగోడలా నిలబడినప్పటికీ మరోవైపు భారత బౌలర్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వీలుచిక్కినప్పుడల్లా వికెట్లు తీస్తూ వచ్చారు. నాగ్పూర్ పిచ్ పేస్కు అనుకూలిస్తున్నప్పటికీ టీమిండియా స్పిన్నర్లు అదరగొట్టారు. 25వ ఓవర్లో తిరుమానె(9)ను అశ్విన్ ఔట్ చేసి లంక పతనానికి తెరలేపాడు. తర్వాత స్వల్ప వ్యవధిలోనే లంక సీనియర్ ఆటగాడు మాథ్యూస్ను జడేజా ఎల్బీగా పెవిలియన్ పంపడంతో లంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.వికెట్లు పడుతున్నప్పటికీ మరో ఎండ్లో పోరాడుతున్న కరుణరత్నెఅర్ధశతకం పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే వెనుదిరిగాడు.