వికారాబాద్ : తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రూ. కోటి 50 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ప్రజా వైద్యం మరింత చేరువ చేస్తామన్నారు. వీలైనన్ని ఎక్కువగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని గుర్తు చేశారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఐసీయూ కేంద్రం ఏర్పాటు తో పాటు అన్ని రకాల చికిత్స లు అందుబాటులో తెస్తామని ప్రకటించారు. వికారాబాద్ లో 100 పడకల ఆస్పత్రి ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఆస్పత్రిలో వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ సాధనే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. కర్ణాటక సరిహద్దులోని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిని కార్పోరేట్ తరహాలో తీర్చిదిద్దుతామని చెప్పారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి ఏర్పాటు, అభివృద్ధి పనులకు రూ. 3 కోట్ల 50 లక్షల నిధులు అందించామని మంత్రి తెలిపారు.