హైదరాబాద్: భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని ఉమ్మడి హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. ఇటీవల వర్షాల కారణంగా కూలిపోయిన ఆలయానికి చెందిన ప్రాకారం మరమ్మతు పనులను చేపట్టనున్నట్టు తెలిపింది. ప్రాచీన రామప్ప దేవాలయానికి చెందిన గోడ కూలిందని ఇటీవల దినపత్రికల్లో ప్రచురితమైన వార్తలను ఉమ్మడి హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆలయ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వివరించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కేంద్ర పురావస్తుశాఖ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కే లక్ష్మణ్ బుధవారం ఉమ్మడి హైకోర్టుకు వివరణ సమర్పించారు. సీనియర్ ప్రొఫెసర్లు, సివిల్ ఇంజినీర్లు, వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) కాలేజీ అధ్యాపకుల బృందం రామప్ప దేవాలయాన్ని సందర్శించి.. ఆలయ నిర్వహణ, మరమ్మతులపై తమకు నివేదికను ఇచ్చిందని చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టేందుకు కేంద్ర పురావస్తుశాఖ సిద్ధంగా ఉన్నదని లక్ష్మణ్.. న్యాయస్థానానికి వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపడుతారో రెండువారాల్లో తమకు తెలియజేయాలని ఆదేశించి, తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది.