ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రాద్రి ఆలయంలో అపచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2017, 08:58 AM

భద్రాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అపచారం జరిగింది. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఓ జంట నిబంధనలకు విరుద్ధంగా గర్భగుడిలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని రాత్రి వరకు బయటకు పొక్కనీయకుండా ఆలయ అధికారులు, పూజారులు జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. కాగా, మీడియా ప్రతినిధులకు విషయం తెలిసి ఆరా తీయగా.. సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలిసింది. సోమవారం సాయంత్రం ఓ జంట పూజల నిమిత్తం టిక్కెట్టు కొనుక్కుని ఆలయంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో అక్కడ అర్చకులెవరూ లేకపోవడంతో బంగారు వాకిలి దాటి గర్భగుడిలోకి ప్రవేశించారు. అయినా ఎవరూ గమనించలేదు. సుమారు 5 నిమిషాలపాటు అక్కడే ఉన్న ఆ జంట కొబ్బరికాయ కూడా కొట్టినట్లు తెలిసింది.ఆలస్యంగా మేలుకొన్న ఆలయ సిబ్బంది. గర్భగుడిలోకి వెళ్లిన ఆ జంటను ప్రధాన ఆలయం నుంచి బయటకు పంపారు. వెంటనే ఆలయంలో సంప్రోక్షణ చర్యలు చేపట్టారు.


మూల విరాట్‌ను తాకారా? లేదా అన్నది తెలియనప్పటికీ సంప్రదాయాలను పాటించే ఈ ఆలయంలో ఇదో పెద్ద అపచారంగా భావిస్తున్నారు.కాగా, మరికొందరు భక్తులు కూడా ఆలయంలోకి ప్రవేశించి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు దర్శనాలు చేసుకున్నట్లు తెలిసింది. అయితే, సాయంత్రం వేళ విధుల్లో ఉండాల్సిన అర్చకులు ఎక్కడకు వెళ్లారో తేలాల్సి ఉంది.ఆలయంలో పనిచేసే కొందరు వైదిక పెద్దలు కూడా గర్భగుడిలోని మూల విరాట్‌ వద్దకు వెళ్లరు. ఇలాంటి కట్టుబాట్లు, నియమాలు ఇక్కడ అమల్లో ఉండగా.. విధుల్లో ఉన్న అర్చకులు, సిబ్బంది ఇంత నిర్లక్ష్యం వహించడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో రమేశ్‌బాబు మీడియాకు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa