ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని నగరంలో మరో కసాయి తల్లి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 04, 2017, 07:53 AM

రాజధాని నగరంలో మరో కసాయి తల్లి దుశ్చర్య బయటపడింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని నాలుగేళ్ల కుమార్తెను చిత్రహింసలు పెట్టింది. ప్రియుడితో పడక సుఖం కోసం అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని కాలుతున్న వేడి వేడి పెనం మీద కూర్చోబెట్టిన విషాదకరమైన సంఘటన హైదరాబాద్‌లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పశ్చిమ శ్రీనివాసనగర్‌లో వెలుగుచూసింది.


ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ప్రాంతానికి చెందిన లలితకు వివాహం జరిగి నాలుగేళ్ల కూతురు ఉంది. అయితే అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్‌తో లలితకు పరిచయం ఏర్పడటంతో ఇది అక్రమ సంబంధానికి దారితీసింది. ప్రకాశ్ అంతకు ముందే వివాహం కాగా అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. లలితతో అక్రమ సంబంధం అనంతరం శ్రీకాకుళం జిల్లా నుండి లలిత, ప్రకాశ్‌లు పారిపోయి హైదరాబాద్‌లో భార్యాభర్తలమని చెప్పి ఓ హాస్టల్‌లో పనికి చేరారు.


అయితే తన అక్రమ సంబంధానికి కూతురు అడ్డుగా ఉందనే నెపంతో ప్రియుడు ప్రకాశ్‌తో కలిసి నాలుగేళ్ల కూతుర్ని చిత్రహింసలకు గురిచేసి వేడివేడి పెనంపై కూతురిని కూర్చోబెట్టింది. దీంతో చిన్నారి పిరుదులు, కాళ్లు పూర్తిగా కాలిపోయాయి. అంతటితో ఆగకుండా ఆ చిన్నారిని ఎలాగైనా వదిలించుకునేందుకు ఓ కట్టుకథను అల్లి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.


తమకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గాయాలతో ఓ బాలిక కనిపించిందంటూ పోలీస్ స్టేషన్‌ కథ అల్లారు. దీంతో విచారణ చేపట్టిన పోలీస్‌లు ఇదంతా కట్టుకథ అని.. అసలు నిందితులు తల్లి, ఆమె ప్రియుడని తేల్చేశారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని యూసుఫ్‌గూడ శిశు విహార్‌కు తరలించిన పోలీసులు.. తల్లి లలిత, ఆమె ప్రియుడు ప్రకాశ్‌లను అదుపులోకి తీసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com