మేడ్చల్: మేడ్చల్ ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల 2013లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తాత్కాలికంగా కళాశాలకు మేడ్చల్ పట్టణంలో పాత గ్రామ పంచాయతీ పక్కన ఉన్న జిల్లా పరిషత్ బాలికల పాఠశాల పాత భవనాన్ని కేటాయించారు. కళాశాలలో మూడు ఈసీఈ, ఈఈఈ, మెకానిక్ కోర్సులను నిర్వహిస్తుండగా 484 మంది బాల బాలికలు ఆయా కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారు.ఆ భవనంలో డిమాండ్ మేరకు సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా తరగతి గదులు లేకపోవడం, అరకొరగా ఉన్న మరుగుదొడ్ల సౌకర్యం, ల్యాబ్ల నిర్వహణకు అవకాశం లేకపోవడం, వసతి లేమి తదితర అసౌకర్యాలు ఉన్నాయి. ల్యాబ్లు లేకపోవడంతో వివిధ కోర్సుల్లో ప్రాక్టికల్స్ చేయడానికి రామంతాపూర్, మాసబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.