తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత సమాధి వద్ద సినీనటుడు విశాల్ ఈ రోజు నివాళులర్పించాడు. ఈ నెల 21న తమిళనాడులోని ఆర్కేనగర్కు ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే తరపున మధుసూదన్ బరిలోకి దిగుతుండగా, శశికళ వర్గం నుంచి దినకరన్, స్వతంత్రుడిగా విశాల్ ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే విశాల్ జయలలిత సమాధి వద్ద నివాళులర్పించి, నామినేషన్ సెంటర్కు వెళ్లి నామినేషన్ దాఖలు చేశాడు. కాగా, విశాల్ నామినేషన్ వేసిన ఆ సెంటర్లో స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు తమ మద్దతుదారులతో అక్కడికి చేరుకున్నారు. మరోవైపు సినీనటుడు విశాల్ కూడా అక్కడికి వస్తుండడంతో భద్రతా సిబ్బంది ఇతర అభ్యర్థుల మద్దతుదారులను లోపలికి అనుమతించలేదు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది.