ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షమీకి కూడా గ్రౌండ్‌లోనే వాంతులు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2017, 07:57 AM

ఢిల్లీ కాలుష్యం శ్రీలంక ప్లేయర్స్‌కే కాదు.. ఇండియన్ ప్లేయర్స్‌నూ సమస్యగా మారింది. మంగళవారం (డిసెంబర్ 5) ఉదయం లంక బౌలర్ సురంగ లక్మల్.. గ్రౌండ్‌లోనే వాంతి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా లంక రెండో ఇన్నింగ్స్ సందర్భంగా భారత బౌలర్ షమి కూడా వాంతి చేసుకున్నాడు. సదీర వికెట్ తీసిన తర్వాత ఆరో ఓవర్లో చాతిని పట్టుకొని కాస్త ఇబ్బందిగా కనిపించిన షమి వెంటనే వాంతి చేసుకున్నాడు. దీంతో కాలుష్యం ఆటగాళ్లపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో స్పష్టమైంది.


వాస్తవానికి రెండో రోజు లంక ఆటగాళ్లు మాస్కులతో ఆడటం, పదేపదే మ్యాచ్‌కు అడ్డం పడటం చూసి భారత ఆటగాళ్లతో పాటు, అభిమానులు కూడా విమర్శించారు. అంపైర్లు, భారత ఆటగాళ్లు, ప్రేక్షకులకు లేని సమస్య వాళ్లకే ఎందుకన్న అనుమానం కలిగింది. అయితే ఇప్పుడు షమి కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కోవడం కాలుష్యం దుస్థితికి అద్దం పడుతోంది.సోమవారం టీమిండియా తరఫున మీడియాతో మాట్లాడిన షమీ.. కాలుష్య స్థాయి ఆందోళనకరంగానే ఉందని చెప్పడం గమనార్హం. అయితే భారత ఆటగాళ్లు దానికి అలవాటు పడటం వల్ల పెద్దగా సమస్యలు ఎదుర్కోలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మ్యాచ్‌ రెండో రోజు గాలిలో కాలుష్యం తీవ్రత 338 ఉండగా.. సోమవారం 455గా నమోదైంది. నాణ్యత సూచీలో 150 మార్క్‌ దాటితే గాలి అత్యంత ప్రమాదకరంగా ఉందని అర్థం.


మరోవైపు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ హెచ్చరికలతో.. ఇకపై ఢిల్లీలో మ్యాచ్‌లు షెడ్యూలు చేసే ముందు వాయు కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకుంటామని బీసీసీఐ వెల్లడించింది. చరిత్రలో తొలిసారి ఫిరోజ్‌ షా కోట్లాలో భారత్‌తో మూడో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఫీల్డింగ్‌ చేసిన అంశాన్ని ట్రైబ్యునల్ తీవ్రంగా పరిగణించింది. వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిన ఢిల్లీలో మ్యాచ్‌లు ఎందుకు నిర్వహిస్తున్నారని బీసీసీఐని ప్రశ్నించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com