ఆర్కేనగర్ ఉపఎన్నికల బరిలోకి దిగిన నటుడు విశాల్, జయలలిత మేనకోడలు దీప జయకుమార్ల నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. వీటితోపాటు పలువురు స్వతంత్రుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయితే విశాల్ నామినేషన్ తిరస్కరించాక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిరసనల నేపథ్యంలో ఆయన నామినేషన్ మళ్లీ ఆమోదించినట్లు వార్తలొచ్చాయి. ‘సత్యం గెలిచింది.. ఎన్నికల అధికారి నా నామినేషన్ ఆమోదించారంటూ’ విశాల్ ట్వీట్ చేయడంతో ఆ విషయం ప్రసార మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారమైంది. చివరకు మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో విశాల్ నామినేషన్ను కూడా తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. సాంకేతిక కారణాలతో దీప నామినేషన్ను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ పత్రంలో దీపన్, సుమతి అనే ఇద్దరి సంతకాలను ఫోర్జరీ చేయడంతో విశాల్ నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి పేర్కొన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 7వ తేదీ వరకు గడువు ఉంది. అప్పుడే అభ్యర్థుల గుర్తులపై కూడా ఒక స్పష్టత వస్తుంది. తిరస్కరణపై అప్పీల్ చేయనున్నట్లు విశాల్ తండ్రి జీకే రెడ్డి తెలిపారు.