ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో నగరవాసి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 08:05 AM

నగరంలోని కుత్బుల్లాపూర్‌కు చెందిన నాగతులసీరామ్‌ అమెరికాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.   నాగతులసీరామ్‌ వాటర్‌బర్రీలో ఉంటూ బ్రిడ్జిపోర్ట్‌ యూనివర్సిటీలో ఎం.ఎస్‌. చదువుతున్నాడు. కనెక్టికట్‌ రాష్ట్రం షెల్‌టన్‌ సిటీలో ఈ ప్రమాదం జరిగింది. కారు పాడవడంతో కాలిబాటపై నడుచుకుంటూ తులసీరామ్‌ వెళుతుండగా, తన కారుపై అదుపు కోల్పోయిన ఓ మహిళ వేగంగా అతన్ని ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. బుధవారం ఉదయం నగరంలోని సూరారంకాలనీలోని తండ్రి జాకబ్‌కు ప్రమాద విషయాన్ని చెప్పారు. తన కుమార్తెకు ఇక అండ ఎవరంటూ ఆ తండ్రి కన్నీరు మున్నీరవడం స్థానికులను కలిచివేసింది. పిల్లల చిన్నతనంలోనే వారి తల్లి చనిపోగా, బిడ్డలకు అన్నీతానై పెంచిన ఆ తండ్రి అప్పుచేసి మరీ కొడుకును ఉన్నత విద్యకు విదేశాలకు పంపించారు. ఇటీవల రెండుసార్లు గుండెపోటుకు గురయ్యాడు. శస్త్రచికిత్సకు కూడా అవకాశంలేదని, బతికినన్ని రోజులు మందులపైనే ఆధారపడాలని వైద్యులు సూచించారు. అయినా ఆ నాన్న గుండె చలించలేదు. విదేశాల్లో చదువుతున్న కొడుకు అండగా ఉంటాడన్న ధైర్యంతో బతుకుతున్న అతన్ని విధి కుంగదీసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com