అంచనాలకు తగ్గట్టే మెట్రోరైలు ప్రారంభమైన మార్గం లో ట్రాఫిక్ తగ్గింది. కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమైన వారం రోజుల్లోనే నగరంలో రవాణాపై మెట్రోరైలు ప్రభావం చూపిస్తున్నది. మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫి క్ కష్టాలు తగ్గుముఖం పడుతున్నట్టు హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో తేలిం ది. రోజుకు లక్ష నుంచి లక్షా యాబైవేల మంది వరకు మెట్రోను ఆశ్రయిస్తుండడంతో రోడ్లపై పడుతున్న భారం తగ్గుతున్నదని, రద్దీ తగ్గి వాహనాలు రయ్మంటూ దూసుకుపోతున్నాయని వెల్లడైంది. నవంబర్ 29 నుంచి నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల మేర మెట్రోరైలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. సాధారణ రోజుల్లో సగటున 1.5 లక్షల మంది దీనిని వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని వాహనాల కదలికలపై హెచ్ఎంఆర్ఎల్ అధ్యయనం చేపట్టింది. బేగంపేట, ఎస్పీరోడ్ రహదారిలో వాహనాల వేగం పెరిగిందని, పంజాగుట్ట, అమీర్పేట నుంచి హైటెక్సిటీ రోడ్ వరకు వాహనాల రాకపోకల్లో తేడాలున్నాయని ఈ అధ్యయనంలో తేలింది.