హైదరాబాద్: కూలీ పనులు చేసి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రులపై కేసు పెట్టాలని వేసిన కేసు దర్యాఫ్తు గురించిన వివరాలు చెప్పాలని హైకోర్టు బుధవారం తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఆదేశించింది.
గులాబీ కూలీ పేరుతో వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారంటూ మంత్రులపై కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిన ఫిర్యాదు ఎప్పుడు అందింది? ఏ దశలో ఉందో చెప్పాలంటూ ఉమ్మడి హైకోర్టు బుధవారం ఏసీబీని అడిగింది.గులాబీ కూలీ పేరుతో చిన్నచిన్న పనులు చేసి భారీగా వసూళ్లు చేపట్టి, ఆ నిధులను టీఆర్ఎస్ ప్లీనరీలకు వినియోగించిన మంత్రులపై ఫిర్యాదు చేసినా ఏసీబీ చర్య తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ రేవంత్ రెడ్డి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్పై జస్టిస్ ఎస్వీ భట్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. అధికారంలో ఉన్న వ్యక్తులు ఇలా వసూలు చేయడం అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందన్నారు.దీనిపై జడ్జి స్పందిస్తూ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. టీఆర్ఎస్ ప్లీనరి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగింది.అప్పుడు కేటీఆర్ తదితర టీఆర్ఎస్ నేతలు కూలీ పని చేసి డబ్బులు సంపాదించిన విషయం తెలిసిందే. వారు చేసిన గంట లేదా రెండు గంటల కూలికి లక్షలు, వేలు జమ అయ్యాయి. ఇది వివాదాస్పదమైంది కూడా.