హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సియు)లో విద్యార్ధుల సస్పెన్షన్ నిర్ణయం తాజాగా వెలుగులోకొచ్చింది. సస్పెన్షన్ ఆర్డర్లను విద్యార్థులకు బుధవారం పంపించారు. పదిమంది విద్యార్ధుల్ని సస్పెండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్ అప్పారావు తీసుకున్న నిర్ణయాన్ని వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమర్ధించింది. ముగ్గురు విద్యార్థులపై రెండేళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగించాలనీ, మరో ఏడుగురు విద్యార్థులపై ఆరు వారాల పాటు హాస్టల్, అకాడమిక్ తరగతులకు హాజరుకాకుండా వేటు వేయాలని ఈనెల 2న సమావేశమైన ఈసీ నిర్ణయించింది.
దీనిపై విద్యార్థి సంఘాలు, విద్యార్థులు మండిపడుతున్నారు నవంబర్ 3న వర్సిటీ ఆవరణలోని జే హాస్టల్లో ఒకే రూములో విద్యార్థి, విద్యార్థినితో ఉండడంతో వారి గుర్తింపు కార్డులు చూపించాలని వార్డెన్ కోరారు. అయితే విద్యార్థులు తమపై దాడి చేశారని విసికి వార్డెన్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఓ కమిటీతో విచారణ చేయించి ముగ్గురు విద్యార్థులపై రెండేళ్లు, ఏడుగురు విద్యార్థులపై ఆరునెలల పాటు సస్పెన్షన్ వేటు వేస్తూ నవంబర్ 5న విసి నిర్ణయం తీసుకున్నారు.
దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు వర్సిటీలో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టడంతో సస్పెన్షన్ను తాత్కాలికంగా ఎత్తేశారు. ఈక్రమంలో డిసెంబర్ 2న సమావేశమైన వర్సిటీ పాలకమండలి ఈసీ, విసి తీసుకున్న చర్యల్ని సమర్థించింది. ఎంఏ సెకండియర్ విద్యార్థులు ప్రత్యూష్ నిర్జహీర్, అథిర యున్ని, సగ్నిక్ సహాలపై రెండేళ్ల పాటు సస్పెన్షన్ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో ఏడుగురు విద్యార్థులు తినన్జలి దమ్, కేశబన్ శంకర్రారు చౌదరి, శివమ్గోస్వామి, సాహిత్ మందపల్లి, వెంకటేశ్వర్లు ఎరుకల, అర్పిత్ శంకర్, యామర్తి సాయికుమార్లపై సస్పెన్షన్ను ఆరు నెలల నుంచి ఆరు వారాలకు తగ్గించింది.