ధర్మశాల: శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్లకు రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. వరుస క్రికెట్ ఆడుతోన్న కోహ్లీ తనకు విరామం కావాలని కోరగా ఈ రెండు సిరీస్ల నుంచి బీసీసీఐ తప్పించింది. అతని స్థానంలో రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించింది. ఐపీఎల్లో రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడిన చాహల్ ఇప్పుడు మరోసారి అతడి నాయకత్వంలో టీమిండియా తరఫున ఆడబోతున్నాడు.
ఈ నేపథ్యంలో చాహల్.. రోహిత్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ ‘2013 ఐపీఎల్లో నా అరంగేట్రం ముంబయి ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ నాయకత్వంలో చేశాను. కోహ్లీలాగే రోహిత్ శర్మ కూడా దూకుడు స్వభావం కలిగిన ఆటగాడే. జట్టును ముందుండి నడిపిస్తాడు. అయినప్పటికీ వీరిద్దర్నీ పోల్చలేం. ఎవరి స్టైల్ వారిదే. ఇద్దరిలో నేను గమనించింది ఏంటంటే.. విజయాల కోసం వీరు ఎప్పుడూ ఆకలిగానే ఉంటారు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ విజయవంతమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా రోహిత్ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్ ట్రోఫీని దక్కించుకున్న సంగతి తెలిసిందే కదా’ అని చాహల్ తెలిపాడు.
జట్టులో ఇంచుమించుగా ఒకే వయసు వాళ్లం ఉన్నాం. ప్రతి ప్లేయర్కు జట్టు విజయం కోసం ఏం చేయాలన్న దానిపై పూర్తి అవగాహన ఉందని చాహల్ అన్నాడు.