చారిత్రక కట్టడం తాజ్మహల్ను కనీసం మరో వందేళ్లపాటు సంరక్షించేందుకు సమగ్ర కార్యచరణ రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాలుష్యం భారి నుంచి తాజ్మహల్ను పరిరక్షించడంపై పర్యావరణవేత్త ఎం.సి మెహతా దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు... తాజ్ ట్రెపీజియన్ జోన్ టీటీజెడ్ అథారిటీని ఈ మేరకు ఆదేశించింది. తాజ్మహల్ పరిరక్షణకు చేపట్టనున్న చర్యలపై టీటీజెడ్ అధికారులు సమర్పించిన ప్రమాణ పత్రాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అందులో ప్రతిపాదించిన చర్యలు తాత్కాలికమైనవిగా ఉన్నాయని, దూరదృష్టితో సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించింది. తాజ్మహల్ పరిరక్షణకు కార్యచరణ ప్రణాళిక రూపకల్పనలో నిపుణులతో పాటు, పౌరసమాజం సభ్యులను భాగస్వాములను చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను 8 వారాల పాటు వాయిదా వేసింది.