గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కీలక అంకానికి చేరుకున్నాయి. గుజరాత్ శాసనసభ తొలి దశ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజరు రూపానీ, కాంగ్రెస్కు చెందిన శక్తిసింV్ా గోహిల్(మాండ్వి), పరేష్ ధనాని(అమ్రేలి) సహా 977 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు.
వీరిలో 443 మంది స్వతంత్ర అభ్యర్థులు కావడం విశేషం. 2.12 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. వీరిలో పురుషుల 1.11కోట్లుకాగా, మహిళలు 1.01 కోట్లు. కామ్రేజ్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఓటర్లు వుండగా...ఉత్తర సూరత్లో తక్కువ మంది ఓటర్లు వున్నట్లు ఇసి వెల్లడించింది. గత రెండు దశాబ్దాలుగా గుజరాత్లో అధికారంలోవున్న బిజెపి ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సర్వత్రా అసంతృప్తి, వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు సర్వేలో తేలడమే దీనికి కారణం. మరోవైపు కాంగ్రెస్ కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీంతో రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. ఇరు పార్టీలకు చెందిన మహామహులు పాల్గొన్న ఈ ప్రచార కార్యక్రమానికి గురువారం సాయంత్రం తెరపడింది. చివరి రోజున ప్రధానిని ఉద్దేశించి మణిశంకర్ అయ్యర్ చేసిన 'నీచుడు' వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.
గుజరాత్లో మొత్తం 182 స్థానాలుండగా...తొలి దశలో 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అన్ని స్థానాల్లోనూ భాజపా పోటీ చేస్తుండగా...కాంగ్రెస్ 87 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ 64, నేషనల్ కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. జమానగర్ రూరల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 27 మంది పోటీ చేస్తున్నారు. జగాడియా, గండేవి నుంచి అత్యల్పంగా ముగ్గురు మాత్రమే పోటీలో నిలిచారు. రెండో దశలో 93 స్థానాలకు డిసెంబర్ 14న పోలింగ్ జరగనుంది. 18న ఫలితాలు వెల్లడికానున్నాయి.