హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై శనివారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. క్షేత్రస్థాయిలోప్రాజెక్టు పనులను గురు, శుక్రవారాలలో విస్తృతంగా పర్యటించి పరిశీలించిన సీఎం.. అక్కడి అధికారులతో కాసేపు మాట్లాడారు. ఈ పర్యటనలో తన దృష్టికి వచ్చిన అంశాలను శనివారం నాటి సమీక్షలో చర్చిస్తారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. లక్ష్మీపూర్ వద్ద పనుల పరిశీలన అనంతరం కొద్దిసేపు అధికారులు, నిర్మాణ ఏజెన్సీలతో సీఎం మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏమైనా భూసేకరణ సమస్యలు, ఇతర సమస్యలు ఉన్నాయా అని అధికారులను అడిగారు. ఎటువంటి సమస్యలు లేవని అధికారులు బదులిచ్చారు. తుపాకులగూడెం నుంచి లక్ష్మీపూర్వరకు నిర్మాణం జరుగుతున్న పనులు, పంపుహౌస్లు, బరాజ్ల పనులపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. వాస్తవానికి షెడ్యూలు ప్రకారం శుక్రవారం లక్ష్మీపూర్ వద్దే సమీక్షా సమావేశాన్ని నిర్వహించాల్సి ఉన్నా.. సమయాభావంతో సమావేశాన్ని శనివారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. క్షేత్రస్థాయి ప్రాజెక్టుల సందర్శనవల్ల తనకు మంచి అవగాహన వచ్చిందని, ఇప్పటివరకు సాగిన పనులు, ఇంకా చేపట్టాల్సినవి, వీటికోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలో శనివారం ఉదయం 11.00 గంటలకు ప్రగతి భవన్లో నిర్ణయించుకుందామని అధికారులకు తెలిపారు.
ఈ సమావేశానికి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతోపాటు నీటి పారుదల శాఖ సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, బీహెచ్ఈఎల్, జెన్కో, ట్రాన్స్కో, అటవీశాఖల అధికారులతోపాటు నిర్మాణ ఏజెన్సీలైన ఎల్అండ్టీ, నవయుగ, అఫ్కాన్, మెఘా వంటి కంపెనీల ప్రతినిధులు రావాలని సీఎం కోరారు. నాలుగైదు గంటలపాటు చర్చించుకుంటే ప్రాజెక్టులపై మరింత అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రెండ్రోజులపాటు సాగిన ముఖ్యమంత్రి ప్రాజెక్టుల పర్యటన విజయవంతం కావడంపై హర్షం వ్యక్తంఅవుతున్నది. రెండో రోజు పర్యటనలో ముఖ్యమంత్రి వెంట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విఫ్ కొప్పుల ఈశ్వర్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీలు వినోద్కుమార్, బాల్క సుమన్, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్హుస్సేన్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, డీజీపీ మహేందర్రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, ఆయా జిల్లాల వివిధ ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.